‘హైద‌రాబాద్‌లో దందాల‌న్నీ చంద్ర‌బాబు కోవ‌ర్టుల‌వే..’ – కాంగ్రెస్ ఎమ్మెల్యే

'హైద‌రాబాద్‌లో దందాల‌న్నీ చంద్ర‌బాబు కోవ‌ర్టుల‌వే..' - కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఏపీ(AP) ముఖ్య‌మంత్రి (Chief Minister) చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu)పై తెలంగాణ అధికార‌ పార్టీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. నారా చంద్రబాబు నాయుడి కోవర్టులు (Covert Agents) తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కోవర్టుల ఇళ్లకు నీటి, విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తే, వారే చంద్రబాబును కలిసి బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా చేస్తారని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారి, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరు. చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేసేది వాళ్లే. వారి ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే, వాళ్లే చంద్రబాబు దగ్గరకు వెళ్లి బనకచర్లను బంద్ చేయిస్తారు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కుటుంబంపై ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారం తెలంగాణ సెంటిమెంట్ మ‌రోసారి తెరపైకి తెచ్చిందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బీఆర్ఎస్ నాయకుల నుండి వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, రేవంత్ రెడ్డి గోదావరి, కృష్ణా నదుల జలాలను ఆంధ్రప్రదేశ్‌కు రాసిచ్చారని, ఇది తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం రాసినట్లుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు మరింత రాజకీయ వివాదాన్ని రేకెత్తించాయి.

చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణలో టీడీపీ మళ్లీ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన, తెలంగాణవాదుల్లో ప్రాంతీయ భావోద్వేగాన్ని ర‌గిలించిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక వర్గం మీడియా టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ, తెలంగాణ ప్రతిష్ఠను కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ మీడియా సంస్థలు విచార‌ణ‌లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబంపై ఇష్టారీతిగా ప్ర‌చారం చేస్తోంద‌ని బీఆర్ఎస్ మండిప‌డుతోంది. రేవంత్ రెడ్డికి గతంలో టీడీపీతో ఉన్న సంబంధాలు కూడా ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సున్నితంగా ఉన్నాయి, ప్రాంతీయ సెంటిమెంట్ రాజకీయ నాయకులు, మీడియా సంస్థల చర్యల వల్ల మరింత ఉద్ధృతమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment