తన అందం, అద్భుతమైన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), సోషల్ మీడియా (Social Media) వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఒక తల్లిగా సోషల్ మీడియా వల్ల సమాజంపై పడుతున్న ప్రభావం తనను ఆందోళనకు గురిచేస్తుందని ఆమె అన్నారు.
ఆమె మాటల్లో..
“ప్రజలు ఇప్పుడు గుర్తింపు కోసం సోషల్ మీడియాలో ‘లైక్స్'(Likes) మరియు ‘కామెంట్స్’ కోసం పరుగులు పెడుతున్నారు. కానీ మన నిజమైన విలువను అవి నిర్ణయించలేవు. అసలైన అందం మనలోనే ఉంటుంది. సోషల్ మీడియా మరియు సామాజిక ఒత్తిడికి పెద్ద తేడా లేదని నేను భావిస్తాను. తల్లిగా ఇది నన్ను ఆందోళనకు గురి చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. మన ఆత్మగౌరవం కోసం సోషల్ మీడియాలో వెతకడం తప్పు. అది అక్కడ దొరకదు. నిజమైన ప్రపంచాన్ని చూడాలంటే ఈ సోషల్ మీడియాను దాటి చూడాలి.”
ఆమె చెప్పిన ఈ మాటలు ప్రస్తుత యువతకు ఎంతో అవసరమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రంలో కనిపించారు.