ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తమిళ నటుడు సత్యరాజ్ (Sathyaraj) తీవ్ర హెచ్చరిక చేశారు. దేవుడి (God) పేరుతో తమిళనాడు (Tamil Nadu)లో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని సత్యరాజ్ స్పష్టం చేశారు. ఇటీవల తమిళనాడులో బీజేపీ నిర్వహించిన మురుగన్ మానాడు (Murugan Manadu) సమ్మేళనంలో పవన్ కల్యాణ్ నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై నటుడు సత్యరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్యరాజ్ ఆగ్రహం, హెచ్చరిక
మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే అది పవన్ తెలివితక్కువతనమే అవుతుందని సత్యరాజ్ విమర్శించారు. తమిళ ప్రజలు తెలివైన వారని, తమిళనాట అలాంటి ఆటలు సాగబోవని ఆయన హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) (VCK)పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సత్యరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే నేతల ఖండన
కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు పవన్ను ప్రశ్నిస్తూ, “అసలు తమిళనాడుతో మీకేం సంబంధం? మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు” అని సవాల్ విసిరారు.