ఆంధ్రప్రదేశ్లో చిన్నారులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా కలవచర్ల గ్రామంలో ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా కొల్లు విష్ణు (45) అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును రాజానగరం పోలీసులు విచారిస్తున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు
చిన్నారులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో మహిళా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలికలపై అత్యాచారాలను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులు ఆటవిడుపులో పాల్గొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మహిళల భద్రతపై స్పష్టమైన చర్యలు ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. పాఠశాలల పరిసరాల్లో, గ్రామాల్లో పోలీసులు పహారా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారులపై నేరాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు విధించాలని సామాజిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.








