దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) శుక్రవారం తీవ్రమైన అనిశ్చితి ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Effect) నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్లను గణనీయంగా కుదిపేసింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొనడంతో, మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచే భారీ నష్టాలు (Stock Market Crash) నమోదయ్యాయి. చివరి వరకు అదే ఒత్తిడిలో ట్రేడ్ కొనసాగింది. ఈ ఒక్కరోజు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్(Sensex) 1,414 పాయింట్లు నష్టపోయి 73,198 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(Nifty) 420 పాయింట్లు కోల్పోయి 22,124 వద్ద ముగిసింది.
అన్ని రంగాల్లో పతనం..
మార్కెట్లో అన్ని రంగాల సూచీలు తీవ్ర పతనాన్ని చవిచూశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. BSE మిడ్క్యాప్ ఇండెక్స్ 2.6% తగ్గుదల, స్మాల్క్యాప్ ఇండెక్స్ 3% పతనం, PSU బ్యాంక్స్, IT, ఆటో, మీడియా, టెలికాం రంగాలు 3 నుంచి 4 శాతం నష్టాలు ఎదుర్కొన్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు ఇంకా కొనసాగుతే, మార్కెట్ మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.