అమెరికాలో మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఒకే రన్వేపైకి రెండు విమానాలు ఒకేసారి రావడంతో అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అయితే సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి, ల్యాండింగ్ను తక్షణమే రద్దు చేసి విమానాన్ని మళ్లీ గగనతలానికి తీసుకెళ్లాడు.
ఈ ఘటనకు ప్రైవేట్ జెట్ అనుమతి లేకుండా రన్వేలోకి ప్రవేశించడం ప్రధాన కారణమని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించింది. ప్రయాణికులతో పాటు విమానాశ్రయ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకునేలా చేసిన ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) దర్యాప్తును ప్రారంభించింది.
9 సార్లు అలర్ట్ చేసినా ప్రైవేట్ జెట్ పైలట్ స్పందించలేదని, మిడ్వే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలను పట్టించుకోకుండా రన్వేపైకి ప్రవేశించాడని ఫెడరల్ ఏవియేషన్ తెలిపింది. సౌత్వెస్ట్ విమానం ఒమాహా (నెబ్రాస్కా) నుంచి రాగా, బాంబార్డియర్ ఛాలెంజర్ 350 జెట్ టేనస్సీకి వెళ్తోంది. గత నెలలో ఆర్మీ హెలికాప్టర్ – ప్యాసింజర్ జెట్ ఢీకొని 67 మంది మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. తాజాగా జరిగిన ఈ సంఘటనలో చివరి క్షణంలో ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.








