వందే భారత్ ఎక్స్ప్రెస్ రోజురోజుకు ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలు రూట్లలో ఈ అత్యాధునిక రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక ప్రధాన సమస్యగా ఉన్న ఆహార ఎంపికపై కీలక మార్పు తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకోనివారు రైలులో ప్రయాణించేటప్పుడు ఆహారం కొనుగోలు చేయలేరు. అయితే, తాజా నిబంధనల ప్రకారం, ఇప్పుడు ప్రయాణ సమయంలో కూడా ఫుడ్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అంటే, ఇకపై వందే భారత్ రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరం లేదు.
రైల్వే బోర్డు కీలక ప్రకటన
ఈ కొత్త మార్పును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చైర్మన్ అధికారిక లేఖ ద్వారా ప్రకటించారు. టికెట్ బుకింగ్ సమయంలో ప్రీపెయిడ్ ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని ప్రయాణికులు కూడా, ప్రయాణ సమయంలో అందుబాటులో ఉన్న ఫుడ్ను ఆర్డర్ చేయవచ్చు. గతంలో, ఈ సౌకర్యం లేకపోవడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. ఈ మార్పు వందే భారత్ ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.