కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మల్లన్న వ్యాఖ్యలపై రోజుకో ఫిర్యాదు వెలుగుచూస్తోంది. కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి కలిసి MLC తీన్మార్ మల్లన్నపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు.
తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనను MLC పదవికి అనర్హుడిగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఇది సాధారణ విషయం కాదని, తీన్మార్ మల్లన్నపై తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త వివాదాలకు దారితీసే అవకాశముంది. నిన్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.