సాధారణంగా టికెట్లు అయిపోయాయని సినిమా హాళ్ల ముందు, సీట్లు అయిపోయాయని స్కూళ్లు, కాలేజీల ఎదుట హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ జైలు ముందు ఎప్పుడైనా హౌస్ఫుల్ బోర్డు గమనించారా..? కానీ, విశాఖ సెంట్రల్ జైలు ఎదుట హౌస్ఫుల్ బోర్డు కనిపించింది. సెంట్రల్ జైల్ ఖైదీల సంఖ్య విపరీతంగా పెరగడంతో జైలు అధికారులు జైలు ఖైదీలతో నిండినది అనే బోర్డును తగిలించారు.
1000 మంది ఖైదీలకు సరిపడా ఉన్న జైలులో 2 వేల మంది ఖైదీలను ఉంచారు. వీరిలో కేవలం గంజాయి కేసులో ఉన్న ఖైదీలు 1,050 మంది ఉన్నారు. జైల్ ఫుల్ కావడంతో రాజమండ్రి జైలుకు కొంత మంది ఖైదీలు తరలించినట్లుగా తెలుస్తోంది. ఈనెల 28వ తేదీ నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభించినట్లుగా సమాచారం. 20 మంది చొప్పున కట్టుదిట్టమైన భద్రత నడుమ, ఇప్పటి వరకు 60 మంది ఖైదీలు తరలించినట్లుగా తెలుస్తోంది.
జైలు ముందు హౌస్ఫుల్ పెట్టడమే కాకుండా.. అందులో ఖైదీలను ఇతర జైళ్లకు తరలింపు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుదలకు ఈ అంశం అద్దం పడుతోంది.