అమెరికాలోని వాషింగ్టన్, రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం గాల్లోనే మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొంది. అనంతరం ఆ విమానం సమీపంలోని పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మృతిచెందినట్లుగా తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన విమానం 60 మంది ప్రయాణికులతో కాన్సాస్లోని విషిటా నుంచి బయల్దేరింది. బుధవారం సాయంత్రం రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్టు ల్యాండింగ్కు సిద్ధమవుతుండగా మిలిటరీకి చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్హాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. భారీ శబ్ధంతో రెండూ పోటోమాక్ నదిలో కుప్పకూలాయి.
విమానంలో ప్రయాణిస్తున్న 60 మందిలో 18 మంది ప్రయాణికులు చనిపోయినట్లుగా సమాచారం. అయితే మిగిలినవారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.