సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్ ధరలు పెద్ద షాకే ఇచ్చాయి. పండుగ సమయానికి పన్నెండు రోజుల ముందు నుంచే ఈ టికెట్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం లేదా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సాధారణ ధరలకు మించి భారీగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పండుగ సమయంలో..
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లాలంటే ఒక్కో కుటుంబం రూ. 15,000 నుండి రూ. 20,000 చెల్లించాల్సి వస్తోంది. అదే విధంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, పాలకొల్లు, భీమవరం వెళ్లేందుకు ప్రైవేట్ బస్ బస్సులు ఒక్కో టికెట్పై రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు పెంచేశాయి. గతంలో రూ. 1000 నుండి 1200 ఉండే టికెట్లు ఇప్పుడు రూ. 3000 పైమాటే అని ప్రయాణికులు వాపోతున్నారు.
ఈ విధంగా ప్రయాణికులపై టికెట్ ధరలు పెద్ద భారంగా మారడం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు ఈ ధరల పెంపును నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.