దేశంలోని పలు ప్రాంతాల్లో మాన్సూన్ (Monsoon) మరోసారి చురుగ్గా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం గురువారం (ఆగస్టు 20) ఉత్తర, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rainfall) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండగా.. తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ(Northeastern States) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఉత్తర జార్ఖండ్, నైరుతి బిహార్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం(Low Pressure Area), దానికి అనుబంధంగా కొనసాగుతున్న మాన్సూన్ ట్రఫ్ ప్రభావంతో వర్షాలు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 20న ఆగ్నేయ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో రానున్న రోజుల్లోనూ వర్షాల తీవ్రత కొనసాగనుంది. తూర్పు మధ్యప్రదేశ్లో ఆగస్టు 25 వరకు, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఆగస్టు 20 నుంచి 23 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఢిల్లీ-NCRలో (Delhi-NCR) వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ మేఘావృత వాతావరణం, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో ఆగస్టు 25 వరకు విస్తారంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దీంతో ఉత్తర, మధ్య, ఈశాన్య భారతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లోనూ రానున్న రోజుల్లో మాన్సూన్ ప్రభావం కొనసాగనుంది.








