టీమిండియా (Team India) ప్రస్తుతం ఇంగ్లండ్ (England) పర్యటనలో ఉండగా, కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్ల అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడలు-2026లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) జట్టుకు కోచ్గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence) హెడ్గా ఉన్న లక్ష్మణ్.. గతంలోనూ ప్రధాన కోచ్ అందుబాటులో లేని సందర్భాల్లో భారత జట్టుకు విజయవంతంగా మార్గనిర్దేశం చేసిన అనుభవం ఉంది. ఇదే సమయంలో గంభీర్ మాత్రం స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే సిరీస్కు సీనియర్ జట్టుతో కలిసి ఉండనున్నట్లు తెలుస్తోంది.
జింబాబ్వే(Zimbabwe) పర్యటనలో లక్ష్మణ్కు తోడుగా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (Sunil Joshi) బౌలింగ్ కోచ్గా, మాజీ బ్యాటర్ హృషికేశ్ కనిత్కర్ (Hrishikesh Kanitkar) బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కోచింగ్ బృందం ఆసియా క్రీడల్లోనూ భారత జట్టుతో కొనసాగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో వైట్వాష్ కావడంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈ కోచింగ్ మార్పుల వార్తలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.









