కంగనా రనౌత్ (Kangana Ranaut) కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘క్వీన్'(Queen) సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన ‘క్వీన్ 2′(Queen 2) విడుదలకు ముందే భారీ న్యాయ వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై ఫాంటమ్ స్టూడియోస్ (Phantom Studios) బాంబే హైకోర్టులో (Bombay High Court) రూ.250 కోట్ల దావా వేసింది. ‘క్వీన్’ చిత్రానికి సంబంధించిన మేధో సంపత్తి (IP) హక్కుల్లో తమకు 50 శాతం వాటా ఉందని, తమ అనుమతి లేకుండానే సీక్వెల్ను నిర్మించారని సంస్థ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారగా, సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది.
ఇప్పటి వరకు ఈ వివాదంపై జియోస్టార్ గానీ, దర్శకుడు వికాస్ బహ్ల్ (Vikas Bahl) గానీ అధికారికంగా స్పందించలేదు. కోర్టు విచారణ ఎలా సాగుతుందనే దానిపైనే ఇప్పుడు ‘క్వీన్ 2’ భవితవ్యం ఆధారపడే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు మరింత పెరిగితే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కంగనా అభిమానులు మాత్రం ఈ వివాదం త్వరగా ముగిసి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘క్వీన్ 2’ అనుకున్న సమయానికే థియేటర్లలోకి రావాలని ఆశిస్తున్నారు.









