కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారి దర్శనం కోసం భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్ట్ టికెట్లలో బ్లాక్ మార్కెట్ దందా (Tickets Black Market Scam) వెలుగుచూడడం కలకలం రేపుతోంది. పరమ పవిత్రంగా, ఎంతో పటిష్టంగా జరగాల్సిన టికెట్ల నిర్వహణలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెన్నై ట్రావెల్ ఏజెన్సీ గుట్టురట్టు
శ్రీవాణి టికెట్ల బుకింగ్లో జరుగుతున్న భారీ అక్రమాలను టీటీడీ(TTD) విజిలెన్స్ విభాగం (Vigilance Department) గుర్తించింది. చెన్నైకి చెందిన ‘పద్మావతి ట్రావెల్స్'(Padmavathi Travels) అనే ఏజెన్సీ ఒకే మొబైల్ నంబర్తో వందలాది శ్రీవాణి టికెట్లను బల్క్ బుకింగ్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. సామాన్య భక్తులకు అందకుండా ఈ టికెట్లను దక్కించుకుని, ఒక్కో టికెట్ను రూ. 13,500 నుంచి రూ. 15,000 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై టీటీడీ ఏవీఎస్వో (AVSO) నేతృత్వంలోని బృందం లోతైన విచారణ జరుపుతోంది.
రద్దు చేస్తామని.. కోటా పెంచారు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామని ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనేక ఆరోపణలు చేశారు. “రద్దు మాట అటుంచి, తాజాగా శ్రీవాణి ట్రస్ట్ కోటాలో అదనంగా 2,000 టికెట్లు పెంచడం గమనార్హం. గత వైఎస్ జగన్ ప్రభుత్వం (YS Jagan Government) ప్రవేశపెట్టిన ఈ ట్రస్ట్ ప్రాముఖ్యతను గుర్తించే ప్రభుత్వం కోటా పెంచిందని, కానీ నిర్వహణలో మాత్రం విఫలమవుతోందని” భక్తులు ఆరోపిస్తున్నారు.
జగన్ హయాంలో లేని దందా.. ఇప్పుడెందుకు?
వైఎస్ జగన్ హయాంలో శ్రీవాణి టికెట్ల విషయంలో కఠినమైన నిబంధనలు ఉండేవని, ఇప్పుడు పర్యవేక్షణ లోపం వల్లనే ట్రావెల్ ఏజెన్సీలు సిండికేట్గా మారి టికెట్లను బ్లాక్ చేస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒకే నంబర్తో పదేపదే టికెట్లు బుక్ అవుతుంటే సిస్టమ్ ఎందుకు గుర్తించలేకపోయింది?, చెన్నై ఏజెన్సీలకు (Chennai Agencies) ఇంత భారీ స్థాయిలో టికెట్లు ఎలా దక్కుతున్నాయి?, భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్న ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు? అని భక్తులు ప్రవ్నిస్తున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణను గాలికొదిలేయడం వల్లే ఇలాంటి వ్యవస్థీకృత అక్రమాలు జరుగుతున్నాయని భక్తులు వాపోతున్నారు. తక్షణమే ఈ బ్లాక్ మార్కెట్ దందాపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








