ఏపీలో(Andhra Pradesh) దారుణ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో భయానక వాతావరణం నెలకొంది. ఏపీఎస్పీ (APSP) కి చెందిన కానిస్టేబుల్(Constable) నాగేశ్వరరావు (Nageswara Rao) (46)ను గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయం (Red Cross Office) సమీపంలో చోటుచేసుకుంది.
ఘటన వివరాలు..
పోలీసుల సమాచారం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన జి. నాగేశ్వరరావు ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆయన సస్పెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో ఉండగా, కొందరు దుండగులు ఆయనపై ఒక్కసారిగా దాడికి దిగారు. పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో నాగేశ్వరరావు రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు.
మద్యం మత్తులో ఘాతుకం?
ఈ దాడి వెనుక మద్యం మత్తులో(Drunken Condition)ఉన్న కొందరు యువకుల హస్తం ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అక్కడ గొడవ జరిగిన శబ్దాలు వినిపించాయని, మద్యం మత్తులో ఉన్న యువకులు తగవు పెట్టుకొని ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని సమాచారం. అయితే, ఈ హత్య వెనుక పాత కక్షలు ఉన్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కాకినాడ వంటి ప్రశాంతమైన నగరంలో, అది కూడా రద్దీగా ఉండే గాంధీనగర్ ఏరియాలో పోలీస్ కానిస్టేబుల్ను ఇలా గొంతు కోసి చంపడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.








‘సిట్’ వేయడమంటే కేసును నీరుగార్చడమే.. – హరీష్రావు