సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ తనకు వచ్చిన రాజకీయ ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను పిలిచి సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి, రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. అయితే నేను వాటన్నింటికి నో చెప్పాను’’ అని వెల్లడించారు.
ప్రజలకు సేవే అసలు రాజకీయం
‘‘రాజకీయాల్లోకి వెళ్లాలని నేనేమీ అనుకోవడం లేదు. అవి నా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని భావిస్తున్నాను. నా స్వేచ్ఛను కోల్పోకుండా ప్రజలకు దగ్గరగా ఉండడం నాకు ముఖ్యమైంది. కొంతమంది డబ్బు కోసం.. ఇంకొందరు అధికారం కోసం రాజకీయాల్లోకి చేరతారు. కానీ ప్రజలకు సహాయం చేయడమే అసలు రాజకీయం’’ అని సోనూ సూద్ వివరించారు. ‘‘రాజకీయాల్లో చేరి ఎవరికో జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పటికే ప్రజలకు సేవ చేస్తూ నా పనిని కొనసాగిస్తున్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి వచ్చిన సోదరి
సోనూ సూద్ సోదరి మాలవిక సూద్ 2022లో కాంగ్రెస్ పార్టీలో చేరి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆప్ అభ్యర్థి అమన్దీప్ కౌర్ అరోరా చేతిలో ఓడిపోయారు.