ఇటీవల హార్ముజ్ జలసంధి అంశం మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది. అమెరికాతో రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఆ ఒప్పందంలో భాగంగా ఈ కీలక జలమార్గాన్ని తెరవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించగా, తొలుత ఇరాన్ అంగీకరించింది. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారాయి.
లెబనాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు చేసిన భారీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం మూసివేతతో గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపినట్టు సమాచారం. 100కి పైగా కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, మరెందరో గాయపడ్డారు. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్, “కాల్పుల విరమణ అన్ని ప్రాంతాల్లో అమలుకావాలి, లేదంటే ఎక్కడా ఉండదు” అంటూ హెచ్చరించింది. లెబనాన్ కూడా ఈ ఒప్పందంలో భాగమేనని ఇరాన్ వాదిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఆ అభిప్రాయాన్ని ఖండిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.









మహిళలను తిట్టిన వ్యక్తికి మద్దతిస్తారా? – నెటిజన్లు ఫైర్