ఎర్ర‌టి ఎండ‌లో నాన్న పాద‌యాత్ర‌.. జ‌గ‌న్ భావోద్వేగ ట్వీట్‌

ఎర్ర‌టి ఎండ‌లో నాన్న పాద‌యాత్ర‌.. జ‌గ‌న్ భావోద్వేగ ట్వీట్‌

రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన ఆ అడుగు పడి నేటికి సరిగ్గా 23 ఏళ్లు. నిప్పులు చెరిగే వేసవి ఎండ.. నడినెత్తి మీద భానుడు.. కానీ, ఆ నాయ‌కుడి గుండెల్లో మాత్రం పేదవాడి కన్నీరు తుడువాలన్న తపన. 2003, ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలైన ‘మ‌హా ప్రస్థానం’.. కేవలం ఒక పాదయాత్ర మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చిన ఒక సామాజిక విప్లవం. పేద‌ల కోసం ఆరోగ్య‌శ్రీ‌, విద్యార్థుల కోసం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పుట్టింది కూడా ఆ పాద‌యాత్ర నుండే..

“నేనున్నానంటూ..” కదిలిన మహానేత
అప్పట్లో కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నల ఆవేదనను చూసి చలించిన వైఎస్సార్.. ఏసీ గదుల రాజకీయాలకు స్వస్తి పలికి రోడ్డు మీదకు వచ్చారు. 1475 కిలోమీటర్లు, 68 రోజులు.. ఎర్రటి ఎండలో చెమట చిందిస్తూ, కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్కచేయక జనం మధ్యే నడిచారు. ఆ నడకలో ఆయనకు వినిపించిన ప్రతి కష్టం.. తర్వాతి కాలంలో ఒక పథకంగా మారి ప్రజల ముంగిటకు వచ్చింది.

తండ్రిని గుర్తు చేసుకుంటూ జగన్ భావోద్వేగం
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్‌గా స్పందించారు. “నాన్న వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమే. ఆనాడు ఆయన ఇచ్చిన ‘నేనున్నాననే’ భరోసా.. ఇవాల్టికీ కోట్లాది మంది గుండెల్లో సజీవంగా ఉంది. రైతన్నల మోమున చిరునవ్వు చూడాలని ఉచిత విద్యుత్ ఫైలుపై ఆయన చేసిన తొలి సంతకం చరిత్రలో నిలిచిపోయింది.”

ఒక సంతకం.. ఎన్నో మార్పులు!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ చేసిన సంతకాలు.. రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయి. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత విద్యుత్ ప‌థ‌కం రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి ‘రాజు’లను చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యేలా మార్గదర్శకం చేసింది. ఆరోగ్యశ్రీ రూపాయి ఖర్చు లేకుండా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించింది. జలయజ్ఞం ప‌థ‌కం సాగునీటి ప్రాజెక్టులతో పచ్చని పొలాలు కళకళలాడేలా చేసింది.

మరువలేని జ్ఞాపకం.. ‘మహాప్రస్థానం’
నేడు వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రతి ఇంట్లోనూ నివసిస్తూనే ఉన్నారు. జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నట్లు.. ఆ తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ఆ ‘ప్రస్థానం’.. ఇవాళ జన హృదయాల్లో ఒక చెరగని సంతకంగా ప‌దిలంగా ఉందంటూ జ‌గ‌న్ భావోద్వేగ ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment