నీరవ్ మోడీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోని హైకోర్ట్ ఆఫ్ జస్టీస్ తాజాగా నీరవ్ మోడీకి పెద్ద షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీని బ్రిటన్ నుంచి భారత్కు అప్పగించేందుకు మార్గం దాదాపు సుగమమైంది. భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ తన కేసును తిరిగి తెరవాలని కోరుతూ పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. రూ. 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. అతను 2019 మార్చి 19 నుంచి లండన్ జైలులో ఉన్నాడు. మోడీ హైకోర్టు, కింగ్స్ బెంచ్ డివిజన్లో ఒక పిటిషన్ను దాఖలు చేశారు.
క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తరఫు న్యాయవాది, సీబీఐ బృందం సహాయంతో, అతని అప్పీలుకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. విచారణ నిమిత్తం సీబీఐ దర్యాప్తు అధికారులతో కూడిన ఒక బృందం లండన్కు వెళ్లింది. కేసును తిరిగి తెరవాలన్న పిటిషన్, దానికి సంబంధించిన పరిస్థితులు పునఃపరిశీలన చేయాల్సినంత అసాధారణమైనవి కావని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోడీని అప్పగించాలని సీబీఐ 2018 నుంచి కోరుతోంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడైన నీరవ్ మోడీ, తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీని వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో భారతదేశంలో విచారణను ఎదుర్కొంటున్నారు. మోడీ ఒక్కరే రూ. 6,498.20 కోట్ల మొత్తాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ప్రతినిధి తెలిపారు.







