సినీ ఇండ‌స్ట్రీ ఏపీకి రావాలి, వ‌స్తే స్వాగ‌తిస్తాం.. – ప‌వ‌న్‌, ప‌ల్లా

సినీ ఇండ‌స్ట్రీ ఏపీకి రావాలి, వ‌స్తే స్వాగ‌తిస్తాం.. - ప‌వ‌న్‌, ప‌ల్లా

సినీ ప‌రిశ్ర‌మ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా పర్యటన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకు ఏపీలో అనువైన ప్రాంతాలు ఉన్నాయ‌న్నారు. షూటింగ్‌ల వ‌ల్ల‌ ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.

అల్లు అర్జున్ ఘ‌ట‌న‌, సినిమా ఇండ‌స్ట్రీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. సినిమా ఇండ‌స్ట్రీ ఏపీకి వ‌స్తే స్వాగతిస్తామని చెప్పారు. ఇండ‌స్ట్రీ ఏపీకి రావాల‌ని డిప్యూటీ సీఎం కూడా కోరార‌ని గుర్తుచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని చెప్పారు. సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు. పరిస్థితిని ముందే అంచనా వేయగ‌ల‌గాల‌ని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఇంటెలిజెన్స్ విభాగానికి సూచించారు. సినీ తార‌లు సైతం పరిస్థితిని అంచనా వేయగలగాల‌న్నారు.

ఇక నుంచి బెన్‌ఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచ‌బోమ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. తాను ముఖ్య‌మంత్రి కుర్చీలో ఉన్నంత వ‌ర‌కు ఈ నిబంధ‌న కొన‌సాగుతుంద‌ని చెప్పారు. కాగా, తెలంగాణ రాజ‌కీయం మొత్తం సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులంతా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్ట‌డాన్ని త‌ప్పుబ‌డుతూ క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు.

కాగా, ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీ ఏపీకి త‌ర‌లిరావాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఇండ‌స్ట్రీ వ‌స్తే స్వాగ‌తిస్తామ‌ని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment