దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిణామంలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం రాజకీయ, భద్రతా వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన దేవ్తో పాటు మల్ల రాజిరెడ్డి, నూనె గంగన్నలు మరియు మరికొంతమంది కార్యకర్తలు జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకోవడం మావోయిస్టు పార్టీకే కీలక మలుపుగా భావిస్తున్నారు. తెలంగాణ ఎస్ఐబీ ఎదుట 16మందితో కలిసి లొంగిపోయిన దేవ్ను అధికారులు త్వరలో మీడియా ముందుకు తీసుకురానున్నారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించిన కేంద్రం చేపట్టిన “ఆపరేషన్ కగార్-2” నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్ జీ 1983లో ఉద్యమంలో చేరి దక్షిణ భారత జోన్ ఆపరేటర్గా ఎదిగి, పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ “అవామి జంగ్” సంపాదకత్వం వహించారు. నేషనల్ ఇన్వేష్టిగేషన్ ఏజేన్సీ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఆయన, 2010 ఏప్రిల్లో దంతేవాడ లో జరిగిన దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రధాన సూత్రధారిగా అనుమానితుడిగా నిలిచారు. ఇటీవల నంబాల కేశవ్ రావు మరణానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్ జీ లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి తుదిఅంకమా అనే చర్చను మరింత వేడెక్కిస్తోంది. భద్రతా దళాల కఠిన చర్యలు, ప్రభుత్వ ఆపరేషన్ల ప్రభావం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








