రాష్ట్ర అత్యున్నత స్థాయి పోలీస్ అధికారి అయిన డీజీపీ (DGP) ర్యాంక్ ఐపీఎస్ అధికారి రాసలీలల వీడియో కర్ణాటక రాష్ట్రం (Karnataka State)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డీజీపీ రామచంద్రారావు (DGP Ramachandra Rao)కు సంబంధించిన వీడియోలు బయటకు రావడం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్ యూనిఫాంలో విధుల్లో ఉండగానే పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో కూడిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారాన్ని సీఎం సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) అత్యంత సీరియస్గా తీసుకుని, వెంటనే డీజీపీని సస్పెండ్ చేయడంతో పాటు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ప్రస్తుతం కర్ణాటక సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Karnataka Civil Rights Enforcement Directorate) డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న రామచంద్రారావు తన కార్యాలయంలోనే మహిళలతో అత్యంత సన్నిహితంగా ప్రవర్తించినట్లు ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చిన మహిళలను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటి దృశ్యాలు రహస్యంగా రికార్డు అయ్యాయని తెలుస్తోంది. మహిళలపై బలవంతం జరిగినట్లు ఆరోపణలు లేనప్పటికీ, ఒక బాధ్యతాయుతమైన అత్యున్నత పోలీస్ హోదాలో ఉండి ఈ తరహా ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు, విపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావు తండ్రి ఈ డీజీపీ రామచంద్రారావే కావడం గమనార్హం. ఈ అంశం మొత్తం వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చింది. అయితే వీడియో తనది కాదని, దీనిపై న్యాయపరంగా పోరాడతానని రామచంద్రారావు కొట్టిపారేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ తప్పనిసరి అని, విచారణలో నిజాలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, ఈ వీడియోల ప్రామాణికతపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యవహారం కావడంతో, పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే తదుపరి చర్యలు ఉంటాయని కర్ణాటక ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.








