అనంతపురం జిల్లాలోని (Anantapur District) ఆకుతోటపల్లి(Akuthotapalli) ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన అనంతపురం టూ టౌన్ సీఐ(CI) శ్రీకాంత్ (Srikant)పై ఆ యువకుడు కత్తి(knife)తో దాడి చేసి గాయపరిచిన సంఘటన కలకలం సృష్టిస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, అజయ్(Ajay) అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అజయ్ ఇవాళ మరోసారి స్థానికులపై కత్తితో దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అజయ్ ఆకుతోటపల్లి ప్రాంతంలో ఉన్నాడన్న సమాచారం అందడంతో టూ టౌన్ సీఐ శ్రీకాంత్ అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఒక్కసారిగా అజయ్ కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో ఆత్మరక్షణ చర్యగా సీఐ శ్రీకాంత్ నిందితుడిపై కాల్పులు జరిపినట్లుగా తెలిపారు. ఈ కాల్పుల్లో అజయ్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
కాల్పుల అనంతరం నిందితుడు అజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తి దాడిలో గాయపడిన సీఐ శ్రీకాంత్ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి (Government Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కాల్పుల్లో గాయపడిన అజయ్కి సైతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి కాలికి తీవ్ర గాయం అయినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్… అజయ్ వేర్వేరు సందర్భాల్లో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడని, ప్రజల భద్రత కోసం అతడిని పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో తనపై ఒక్కసారిగా కత్తితో దాడి జరిగిందని వివరించారు. ప్రాణ రక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆకుతోటపల్లి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.








