ప్రేమించి (Love) పెళ్లిచేసుకున్న యువతిని కట్టుకున్నవాడే కడతేర్చాడు. ఆమె పట్ల అతికిరాతకంగా వ్యవహరించాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరులోని (Tandur) సాయాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని భర్తే కిరాతకంగా కొట్టి చంపిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో కలకలం రేగింది. వరకట్నం (Dowry) తీసుకురావాలంటూ దూషిస్తూ కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అనూష (Anusha) అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. యువకుడి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎనిమిది నెలల క్రితం పరమేష్ (Paramesh)తో అనూష వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మెట్టినింట అడుగుపెట్టిన అనూషకు అత్తమామలతో పాటు భర్త నుంచే వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారం క్రితం గొడవ తలెత్తగా భర్త కొట్టడంతో అనూషకు గాయాలయ్యాయి. తల్లి, వరుసకు సోదరుడు కలిసి ఆమెకు చికిత్స చేయించి పుట్టింటికి తీసుకెళ్లారు.
అయితే సరిగా చూసుకుంటానని, చికిత్స చేయిస్తానని చెప్పి భర్త పరమేష్ మళ్లీ అనూషను తీసుకెళ్లాడు. అనంతరం మరోసారి గొడవపడి తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








