ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్తో టీడీపీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష సన్నిహితంగా మాట్లాడటం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది.
ఈ సంఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. తక్షణ వివరణ ఇవ్వాలని పార్థసారథిని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ..”టీడీపీ కోసం జీవితాంతం కష్టపడతాను. పార్టీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని స్పష్టంగా తెలిపారు.
కాగా, మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలో చేరుతారని, అందుకే పార్థసారధితో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రచారం జరిగింది. పార్థసారధి కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వ్యక్తి కావడంతో ఈ ప్రచారానికి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి అంశాలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.