కనకదుర్గమ్మ (Kanakadurgaamma) కొలువైన విజయవాడ (Vijayawada) నగరంలో భవానీ భక్తులపై (Bhavani devotees) పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) చెయ్యి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భవానీ భక్తులు, పోలీసులు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కంకిపాడు నుంచి తాడేపల్లి సద్ధి (భోజనం) కోసం ఆటోలో బయలుదేరిన భవానీలు మార్గమధ్యంలో పోలీసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోను అడ్డగించిన పోలీసులు అక్కసులో ప్రవర్తించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
ఆటో తాళాలు, ఫోన్లు లాక్కున్న పోలీసులు
భక్తుల వివరాల ప్రకారం.. విజయవాడ రామలింగేశ్వర కట్ట (Ramalingeswara Katta) వద్ద విధుల్లో ఉన్న పోలీసులు భవానీ భక్తులు ప్రయాణిస్తున్న ఆటోను ఆపి వారి ఫొటోలు తీసారు. దీనికితోడు ఆటో తాళాలు లాక్కున్నారని భక్తులు తెలిపారు. పోలీసుల ఈ ప్రవర్తనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భవానీల నుంచి మొబైల్ ఫోన్లు కూడా లాక్కున్నట్లు ఆరోపిస్తున్నారు. “ఫోన్లు ఎందుకు తీసుకున్నారని” ప్రశ్నించడంతో తమతో పాటు భవానీ మాల ధరించిన చిన్న పిల్లలపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని వెల్లడించారు. పిల్లలను కూడా ఇలా హింసించడమేంటని స్థానికులు కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
నిరసనతో నిలిచిన ట్రాఫిక్
పోలీసుల వైఖరికి నిరసనగా భవానీలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు చేరడంతో పరిస్థితి గంటల పాటు ఉద్రిక్తంగా మారింది. ఘటనపై బాధ్యత వహించాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం విచారకరమని భవానీలు మండిపడ్డారు. పోలీసుల ప్రవర్తనపై భవానీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించనున్నారో చూడాలి.








