కాకినాడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) (Kakinada Government General Hospital (GGH))లో మరోసారి పెద్ద స్కాండల్ బయటపడింది. వైరాలజీ ల్యాబ్ (Virology Lab)లో ప్రాణాంతక రోగాల నిర్ధారణ కోసం కాలం చెల్లిన రియేజెంట్లు (Expired Reagents), టెస్టింగ్ కిట్లు (Testing Kits) వినియోగిస్తున్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. ల్యాబ్లో జరుగుతున్న ఈ నిర్లక్ష్యం పట్ల రోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్క్రబ్ టైఫస్, హెపటైటీస్, కోవిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించడానికి వాడే కిట్లు గడువు ముగిసినవే కావడం మరింత కలకలం రేపుతోంది. ప్రస్తుతం కాలం చెల్లిన టెస్టింగ్ కిట్ల ఫొటోలు వైరల్గా మారాయి.
కాలం చెల్లిన రియేజెంట్లతో టెస్టులు
ల్యాబ్ సిబ్బంది (Lab Staff) గడువు ముగిసిన టెస్టింగ్ కిట్లను ఉపయోగిస్తూ, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ల్యాబ్లో మరో నిర్లక్ష్యం బయటపడింది. కోల్డ్ చైన్ మెంటెనెన్స్ లేకుండా, ఎటువంటి ప్రభుత్వ బిల్లులు లేకుండా బయట నుంచి అనధికారికంగా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ల్యాబ్లో నిల్వ ఉండాల్సిన సరుకులు అనధికార మార్గంలో రావడం, వాటి నాణ్యతపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.
బిల్లులు సొంతంగా తయారు చేసి డ్రా చేస్తున్నారా?
సొంతంగా బిల్లులు తయారు చేసి, వాటి ఆధారంగా నిధులను డ్రా చేస్తున్నట్లు ల్యాబ్ నిర్వాహకుడిపై మరో తీవ్రమైన ఆరోపణ వినిపిస్తోంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీజీహెచ్లో తరచూ అవకతవకలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.








