ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని మరో పిడుగులాంటి వార్త భయపెడుతోంది. ఏపీని మరోసారి తుఫాన్ (Cyclone) ముప్పు వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఈనెల 27న ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal)లో సైక్లోన్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో అల్పపీడనం (Low-Pressure) కొనసాగుతుండగా, రేపటికి అది స్పష్టమైన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాయుగుండం తీర ప్రాంతాల వైపునకు కదిలే అవకాశం ఉన్నందున ఏపీ తీర ప్రాంతాల్లో వచ్చే వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్ష సూచనలు వెలువడ్డాయి. పలు ప్రాంతాల్లో గాలులు వేగంగా వీసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొన్ని రోజులపాటు సముద్రం ఉధృతంగా ఉంటుందని, తీరప్రాంతాల్లో అలలు ఎత్తుగా ఎగసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ దిశ, తీవ్రతపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని వెల్లడించారు.







