నెల్లూరు జిల్లాలో మానవత్వం మరిచిపోయిన ఘోర ఘటన చోటుచేసుకుంది. డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేవలం రూ.500 కోసం ఇద్దరిని క్రూరంగా హతమార్చిన సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. మద్యం మత్తులో ఉన్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు పట్టణంలోని పెన్నా నది వైపు వెళ్తున్న శివ అనే వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు పాత నేరస్తులు సాయి శంకర్, మనోజ్ ఆపారు. రూ.500 ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. డబ్బు ఇవ్వలేవని శివ బదులిచ్చాడు. తన దగ్గర డబ్బు లేదని చెప్పడంతో, ఆ ఇద్దరు దుండగులు శివపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న పోలయ్య అనే వ్యక్తి వారిని ప్రశ్నించగా, అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమనే ప్రశ్నిస్తావా అంటూ క్రూరంగా కొట్టి హత్య చేశారు. అనంతరం శివ, పోలయ్య మృతదేహాలను జాఫర్సాహెబ్ కాలువలో పడేసి పారిపోయారు.
కొద్ది సేపటికి కాలువలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి, బండరాళ్లతో కొట్టి చంపినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు శివ స్నేహితుల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ దారుణం నెల్లూరు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది.







