బీహార్ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar), ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి (Vivek Joshi), ఎస్ఎస్ సంధు (S.S. Sandhu) ఈ రెండు రోజుల పాటు పాట్నాలో పర్యటిస్తారు. ఈసీ అధికారులు బీహార్లో గుర్తింపు పొందిన పలు జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ప్రతి పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలను, ఇతర సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్వీకరించింది. అనంతరం, ఎన్నికల సన్నద్ధతపై చేసిన ఏర్పాట్లను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల వివరాలు
ఈ రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లాక, వచ్చే వారం ఏదో ఒక సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2025 నవంబర్ 22తో ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ ప్రారంభంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సెప్టెంబర్ 30న ఈసీ బీహార్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బీహార్లో మొత్తం 7 కోట్ల 42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.








