తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ వేడి రగిలిస్తోంది. ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. గత జూలై 24న హాజరు కావాల్సి ఉన్నా, పార్లమెంట్ సమావేశాల కారణంగా అది వాయిదా పడింది. ఈసారి ముందస్తు అనుమతితో, ఆయన తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి సిట్ ఎదుట విచారణకు రానున్నారు.
బండి సంజయ్ ఇప్పటికే ఈ కేసుపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తూ, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, మాజీ పోలీసు ఉన్నతాధికారులు, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ జరిగిందని సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆధారాలను ఇప్పటికే ఆయనకు అందజేశారు. బీజేపీ ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో సీరియస్గా పరిగణిస్తోంది. అంతేకాక, గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంగా, ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలి అని బీజేపీ డిమాండ్ చేస్తోంది.