పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా (Movie) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వేదికలపై తీవ్ర చర్చలు రేకెత్తిస్తోంది. జనసైనికులు (Janasainiks) ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఆ దిశగానే పనిచేస్తోంది. కాగా, సినిమా మాత్రం అభిమానుల అంచనాలకు మించి లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, జనసేన మాత్రం ఆ నిందను వైసీపీ(YSRCP)పై వేస్తోంది.
ఈ సినిమా కోసం మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క్యాడర్ అంతా రంగంలోకి దిగగా, తాజాగా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు విశాఖలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన నాగబాబు (Nagababu) హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ వాళ్లు చేస్తున్న ప్రచారం దుర్మార్గం అంటూ విమర్శలు చేశారు. వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థంకావడం లేదు, ప్రభుత్వం విషయంలోనూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటూ వ్యాఖ్యానించారు.
సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణం రాజు వంటి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో వైసీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పవన్ సినిమాను బాయ్కాట్ (Boycott) చేయాలని వారికి వారు స్వచ్ఛందంగా పిలుపునిచ్చుకున్నారు. వైసీపీ శ్రేణులతో పాటు టాలీవుడ్లోని నలుగురు ప్రముఖ హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు దూరంగా ఉన్నారు. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ లోపం, ఇంటర్వెల్ తరువాత కథాంశం స్లోగా రన్ అవ్వడం వంటి కారణాలతో ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.
దీంతో జనసేన అగ్రనాయకత్వం మరోసారి రంగంలోకి దిగింది. సినిమా విజయవంతం కోసం జనసేన నాయకులు, మంత్రులు తీవ్రంగా కృషి చేశారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వంటి నాయకులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులను సినిమాను ప్రచారం చేయాలని, థియేటర్లలో చూడాలని సూచించిన ఆడియో లీక్ సంచలనం రేకెత్తించింది. కాగా, హరిహర వీరమల్లు సినిమా హిట్ కొట్టలంటే కథలో దమ్ము ఉండాలని, అది ఉంటే ఎవరు ఎంత అడ్డుపడినా సినిమా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదని ఎవరో ఒకరిపై తోయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.








