హైదరాబాద్ (Hyderabad)లోని మలక్పేట్ (Malakpet)లో చోటుచేసుకున్న కాల్పుల (Firing) ఘటన కేసును పోలీసులు ఛేదించారు. జూలై 15న సీపీఐ (CPI) రాష్ట్ర కమిటీ సభ్యుడు చందు నాయక్ (Chandu Naik)పై దాడి చేసి హత్య చేసిన కేసులో మలక్పేట్ పోలీసులు ఐదుగురిని అరెస్టు (Arrest) చేశారు. ఈ హత్య కేసులో నిందితులు ఉపయోగించిన కారును సీజ్ చేయడంతో పాటు, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గన్స్ (Guns), బుల్లెట్స్ (Bullets)ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ముగ్గురిని అరెస్టు చేసి విచారించిన పోలీసులు, నిందితుల కోసం గత నాలుగు రోజులుగా శ్రమించి చివరకు హైదరాబాద్ శివారులో వారిని పట్టుకున్నారు.
బీహార్ నుంచి ఆయుధాల కొనుగోలు
పోలీసుల దర్యాప్తులో నిందితులు చందు నాయక్ను పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు వెల్లడైంది. బీహార్ నుంచి తుపాకులు, బుల్లెట్లు కొనుగోలు చేసి చందుని వెంబడించి, మలక్పేట్ ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు అక్రమ సంబంధం, గుడిసెల విభేదాలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టయిన నిందితులను ప్రస్తుతం విచారిస్తున్న పోలీసులు, మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. మరోవైపు, మలక్పేట్ కాల్పుల కేసుపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సాయి చైతన్య మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.