ఏపీలో వర్షాభావ పరిస్థితి.. రైతుల ఆందోళనకర దుస్థితి

ఏపీలో వర్షాభావ పరిస్థితి.. రైతుల ఆందోళనకర దుస్థితి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో 2025 ఖరీఫ్ సీజన్‌ (Kharif Season)లో వర్షాభావ ప‌రిస్థితులు రైతుల‌ను (Farmers) క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. వేస‌వి కాలం వెళ్లిపోయి నెల గ‌డుస్తున్నా వ‌ర్ష‌పాతం లేకపోవ‌డం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 1 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 151.24 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 103.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. ఇది 31.3% వర్షాభావాన్ని సూచిస్తోంది.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 13 జిల్లాలు తీవ్ర వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో -66.71% వర్షాభావం నమోదైంది. ఇది ఆ ప్రాంత రైతాంగాన్ని అత్యంత ఆందోళనకరంలోకి నెట్టేసింది. ఈ పరిస్థితి రాష్ట్రంలో సాగు భూముల్లో సగం కంటే ఎక్కువ భాగాన్ని “రెడ్ అలర్ట్”(Red Alert) పరిధిలోకి నెట్టివేసింది. రైతులకు ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది.

వర్షాధారిత సాగు భూములు తీవ్రంగా నష్టపోతున్నాయి, ప్రత్తి (Cotton), వేరుశనగ (Groundnut), మినుము (Green Gram), అప‌రాలు వంటి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. కాలువల క్రింద సాగు చేసిన వరి పంటలు కూడా నీటి కొరతతో ఎండిపోతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్ కడప, తిరుపతి వంటి జిల్లాల్లో వర్షాభావం -46% నుంచి -66% వరకు ఉండటం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు, అన్నమయ్య జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు 816 ఎకరాలకు, టమాటో 1,427 ఎకరాలకు, వరి 339 ఎకరాలకు పరిమితమైంది, ఇది గత సంవత్సరాలతో పోలిస్తే 38-45% తక్కువ. ఈ పరిస్థితి రైతులను తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి నెట్టివేస్తోంది.

గత ఏడాది కనీస మద్దతు ధరలు (MSP) అందక ఆర్థికంగా నష్టపోయిన రైతులు, ఈ సీజన్‌లో వర్షాభావం వల్ల మరింత నష్టాలను ఎదుర్కొంటున్నారు. కంది, వేరుశనగ వంటి పంటల సాగు సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది, ఇది రైతుల ఆదాయాన్ని మరింత క్షీణింపజేస్తోంది. రాష్ట్రంలోని నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమలో, వర్షాభావం ప్రభావం తీవ్రంగా ఉంది. అనంతపురం, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో నీటి లభ్యత సమస్యలు పంటల దిగుబడిని గణనీయంగా తగ్గించాయి, రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment