ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లిన ఇద్దరు విద్యార్థుల వారు వెళ్లిన లక్ష్యాన్ని మరిచి కటకటాల పాలయ్యారు. అమెరికాలో చదువుతున్న ఇద్దరు భారత విద్యార్థులు (Indian Students) మనీలాండరింగ్ (Money Laundering) కేసులో అరెస్టయ్యారు (Arrested). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన విద్యార్థులు మహమ్మద్ ఇల్హామ్ వహోరా (Mohammad Ilham Vohora) మరియు హజీ అలీ వహోరా (Haji Ali Vohora)గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఈస్ట్-వెస్ట్ యూనివర్సిటీ (East-West University) లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయని అగ్రదేశం పోలీసులు పేర్కొన్నారు. కేసు ఇంకా విచారణలో ఉండగా, భారత విద్యార్థుల్లో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది.
అరెస్టు ఎందుకంటే..
2024 అక్టోబర్లో ఒక వృద్ధుడు పోలీసులకు ఫోన్ కాల్ ద్వారా మోసపోయానని సమాచారం ఇచ్చాడు. ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తాను ప్రభుత్వ ఏజెంట్ అని నమ్మబలికి, బెదిరింపులకు దిగాడని, దీంతో భయంతో బాధితుడు క్రిప్టోకరెన్సీ ఏటీఎం ద్వారా డబ్బు పంపించి, బంగారం కొని వ్యక్తిగతంగా ఇద్దరికి అందజేశాడు. అధికారులు దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా, సెల్ ఫోన్ టవర్ రికార్డుల ద్వారా అలి, మహమ్మద్ ఇల్హామ్ వహోరాల స్థావరాన్ని గుర్తించి అరెస్టు చేశారు. అమెరికాలో చదువుకుంటున్న ఇతర భారతీయ విద్యార్థులకు ఇది హెచ్చరికగా మారింది. విదేశాల్లో చట్టాలు కఠినంగా అమలవుతాయని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.








