తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం రేపిన అఘోరీ (Aghori) అలియాస్ అల్లూరి శ్రీనివాస్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూజల పేరుతో ఓ మహిళను మోసగించి రూ.10 లక్షలు వసూలు చేసిన కేసులో పోలీసుల వలలో చిక్కిన అఘోరీకి, చేవెళ్ల (Chevella) కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ (Remand) విధించారు.
మహిళకు మాయ మాటలు – రూ.10 లక్షల మోసం
తన వద్ద పూజల పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసిందని, ఉత్తరప్రదేశ్ ఉజ్జయినికి తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసినట్లు బాధిత మహిళ ఫిబ్రవరి 25వ తేదీన మొకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అఘోరితో పాటు శ్రీవర్షిణిని కూడా హైదరాబాద్కు పోలీసులు తీసుకువచ్చారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రూ.10 లక్షల మోసం కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు వెంటనే అఘోరీని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అఘోరీని చేవెళ్ల కోర్టుకు తరలించిన పోలీసులు, న్యాయమూర్తికి అన్ని ఆధారాలు సమర్పించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో, అఘోరీని కాసేపట్లో జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
పోలీసులకు సహకరిస్తున్నా– అఘోరీ
కోర్టు ఎదుట అఘోరీ స్పందిస్తూ.. కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపింది. అయితే, అఘోరీ మోసపూరిత ఘటనలు ఇంకా చాలా ఉన్నాయని, ఇలా మోసపోయిన వారి చిట్టా చాలా ఉందన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.