మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. “మహిళా కోచ్లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారానికి పాల్పడాలని చూశాడు. తనను రక్షించుకునేందుకు బాధితురాలు ట్రైన్ లోపల నుంచి కిందకి దూకింది. గాయాలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది” అని సబితా అన్నారు.
షీ టీమ్స్ అసలేం చేస్తున్నాయి?
సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ తమ పని నెరవేర్చడంలో విఫలమయ్యాయా? అని ప్రశ్నించారు. “రాష్ట్రంలో మహిళలపై నేరాలు 22 శాతం పెరిగాయనే నివేదికలు చెబుతున్నాయి. అయినా, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రభుత్వ అధికారులు రాజకీయ వేదికగా మార్చారు. వెంటనే దానిని పోలీసులకు అప్పగించి, శాంతి భద్రతలను కాపాడాలి” అని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలిని తక్షణమే ఆదుకోవాలని, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.