నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంచలన లేఖ రాశారు. రాబోయే 2026 డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జనాభా నియంత్రణపై కేంద్ర నిబంధనలను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా పాటించాయన్నారు. ఇప్పుడు అదే కారణం దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోందని, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు కచ్చితంగా తగ్గుతాయన్నారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని ప్రధానమంత్రికి సూచించారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలన్నారు. లోక్సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కోరుతున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటులో సమాన భాగస్వామ్యం కోసం రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా డీలిమిటేషన్ చేపట్టాలని ప్రధానిని కోరారు.
తమిళనాడు, బీజేపీ మధ్య రాజకీయం
డీలిమిటేషన్ అంశంపై కేంద్రంలోని బీజేపీ, తమిళనాడు అధికార డీఎంకే మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇదే లేఖ సారాంశాన్ని డీఎంకేకు పంపించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోందో వేచిచూడాల్సిందే.