ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భూకేటాయింపుల అంశంపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా భూములు కేటాయించడంపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది.
వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఈ అంశాన్ని లేవనెత్తుతూ, “గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు..? ఎవరికి ఎన్ని ఎకరాలు, ఎంత ధరకు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతేడాది ప్రారంభమైన కొన్ని కంపెనీలకు కూడా నామమాత్ర ధరకు భూములు ఇచ్చారని ఆరోపించారు.
వేల కోట్ల విలువైన భూములపై ప్రశ్నలు
వైసీపీ సభ్యులు విజయవాడలో కేవలం రూ.156 కోట్ల పెట్టుబడులకు గాను రూ.600 కోట్ల విలువైన భూములు కేటాయించారని ఆరోపించారు. అమరావతిలో భూకేటాయింపులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం, లూలు సంస్థకు మాత్రం టెండర్లు లేకుండా భూములు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. అలాగే, విశాఖలో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇవ్వడం ఏమిటి..? రియల్ ఎస్టేట్ సంస్థలు భూములు కొనుక్కోలేవా..? అంటూ మండిపడ్డారు.
ఇంకా, విశాఖలో నారా లోకేష్ తోడల్లుడు, టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం విద్యాసంస్థ తమ ఆధీనంలో సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ సంస్థ మాత్రం తాము కేవలం రూ.వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించుకున్నామని చెబుతోందని పేర్కొంటూ, “వెయ్యి కోట్ల విలువైతే భూములు ఆక్రమించుకోవచ్చా..?” అని ప్రశ్నించారు.
మంత్రి నారా లోకేష్ సమాధానానికి కౌంటర్
ఈ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పందించారు. “99 పైసలకు ఎకరం కాదు.. 99 పైసలకు నేను మొత్తం భూమి ఇచ్చారు. అలా ఐదు కంపెనీలకే భూములు కేటాయించాం. అవి కూడా పూర్తిగా క్రెడిబులిటీ ఉన్న సంస్థలే” అని ఆయన స్పష్టం చేశారు. కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఏఎన్ఎస్సార్ గ్లోబల్, రహేజా, మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థలకు మాత్రమే భూములు ఇచ్చామని వెల్లడించారు.
అయితే మంత్రి సమాధానానికి స్పందించిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పైసలుకే భూములిస్తున్నాం కానీ, పొరుగు రాష్ట్రాలు భూములు ఇవ్వకుండానే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాయని లోకేష్కు కౌంటర్ వేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అలా ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు. భూకేటాయింపులు, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి అంశాలపై శాసనమండలిలో జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.








