కడుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్ మీదుగా భారత్ వచ్చారని, వారు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆదివారం కస్టమ్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బ్రెజిల్కు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.21 కోట్ల విలువైన కొకైన్ తరలిస్తున్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ విచారణలో వారు కొన్ని మత్తు పదార్థాలతో కూడిన క్యాప్సూల్స్ తీసుకున్నారని అంగీకరించారు. అనంతరం వారిని కస్టమ్స్ అధికారులు సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించి, క్యాప్సూల్స్ను తీసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఒక నిందితుడు నుండి 105 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటి నుంచి 937 గ్రాముల కొకైన్ను జప్తు చేశారు. మరొక మహిళా నిందితురాలు నుంచి 562 గ్రాముల కొకైన్ ఉన్న 58 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.20.98 కోట్ల విలువ ఉంటాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు.