అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో వైసీపీ జడ్పిటిసి వారం నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం పెదపేట గ్రామం వద్ద నూకరాజును కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం భూమి వివాదమే ఈ ఘటన వెనుక ఉన్న ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
నూకరాజు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, గతంలో కూడా నూకరాజుపై హత్యాయత్నం జరిగినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీ వద్ద పలు మార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యమే నూకరాజు ప్రాణాలను బలితీసుకుందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సీపట్నం ఆసుపత్రి వద్ద నూకరాజు కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ హత్యకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జడ్పిటిసి స్థాయిలో ఉన్న నాయకుడికే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





 



