విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు కీలక డిమాండ్లు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చే ముందు ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయాలని కోరారు.
ప్లాంట్ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు. ప్లాంట్కు అవసరమైన స్టీల్ ఉత్పత్తికి సొంత గనులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 3 ఏళ్ల ట్యాక్స్ హాలీడేతో పాటు 1400 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికుల సమస్యలపై యాజమాన్యం స్పందించాలన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దీని ప్రైవేటీకరణ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైఎస్ షర్మిల అన్నారు.