పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలికలు పచ్చకామెర్లతో మరణించటం పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని మండిపడ్డారు. కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవడంతో విద్యార్థులు కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురై, నలుగురు రోజుల్లో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రానికి సిగ్గుచేటు వ్యవహారమని మాజీ సీఎం జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
మాజీ సీఎం మాట్లాడుతూ.. “ఇది మామూలు ఘటన కాదు, ఇది ప్రభుత్వ హత్య. 611 మంది చదువుతున్న స్కూళ్లో ఇంత జరుగుతున్నా స్పందించని చంద్రబాబు, మంత్రులు గాడిదలు కాస్తున్నారా? గిరిజన బాలికలు పేద పిల్లలు కాబట్టి ఇంత చులకనా చూపు చూపుతున్నారా?” అని ప్రశ్నించారు. తమ హయాంలో పాఠశాలలను దేవాలయాలుగా మార్చి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు.
“మీరు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను నాశనం చేశారు. ఆర్వో ప్లాంట్లు పాడైపోయినా పట్టించుకునే వారు లేరు. మీ నిర్లక్ష్యమే గిరిజన బాలికల ఉసురును తీసింది. చంద్రబాబు నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి” అని డిమాండ్ చేశారు.








