మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పర్యటనలో ఆయన భద్రతా ఏర్పాట్లు పూర్తిగా వైఫల్యం చెందాయని గురువారం రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడారు.
“మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేవు. కూటమి ప్రభుత్వం జగన్ను ఇబ్బందిపెట్టడానికి ప్రణాళికాబద్ధంగా భద్రతను తగ్గిస్తోంది. మా హయాంలో ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడి భద్రత తగ్గించామా?. ఎన్నికల కోడ్ వల్ల భద్రత అందించలేమని చెప్పడం పూర్తిగా తప్పు. ఇదే కోడ్ విజయవాడలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్కు ఎందుకు అమలు కాలేదు?” అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ మిర్చి యార్డ్కు వెళ్లినప్పుడు అనవసరమైన ఇబ్బందులు కల్పించారన్నారు.
దయనీయ స్థితిలో మిర్చి రైతులు..
రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. “మిర్చి ధర గతంలో రూ.20,000 ఉంటే, ఇప్పుడు రూ.10,000కి కూడా పడిపోయింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారి సమస్యలను లెక్కచేయడం లేదు. వైసీపీ హయాంలో రైతుభరోసా పథకం క్రమం తప్పకుండా అమలయ్యేది. కానీ కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రైతులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది” అని విమర్శించారు.