కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. గత సమావేశంలో కుర్చీ వేయలేదని ఆరోపణలు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి, నేడు జరిగిన సమావేశంలోనూ తనకు మేయర్తో పాటు తనకూ కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 7న కుర్చీ విషయంలో జరిగిన గొడవ కారణం వాయిదా పడిన సమావేశం.. మళ్లీ నేటి ఉదయం ప్రారంభమైంది. ఈసారి గందరగోళ పరిస్థితులను నివారించేందుకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ, సమావేశానికి సభ్యులు మినహా ఎవరికీ అనుమతి లేదన్న హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో మున్సిపల్ కార్యాలయానికి ముట్టడికి యత్నించారు.
మున్సిపల్ కార్పొరేషన్ సమావేశలో మేయర్తో పాటు తనకూ కుర్చీ వేయాలని టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశ మందిరంలో ఆందోళనకు దిగారు. ఇందుకు ప్రతిగా మేయర్ సురేష్బాబుకు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు మేయర్ సీటు ముందే కూర్చొని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ మేయర్ ఫైరయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏడుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
దీంతో వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఈ పరిణామాల కారణంగా కడప కార్పొరేషన్లో రాజకీయం మరోసారి వేడి పుట్టించింది.