సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడులతో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మళ్లీ పునర్జీవం పోసుకుంది. మునుపటి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేపట్టిన వినూత్న టాస్క్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం
సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వచ్చిన వైసీపీ సానుభూతిపరులకు సోషల్ మీడియా విభాగం ఓ ప్రత్యేక టాస్క్ ఇచ్చింది. గ్రామాల్లోని సచివాలయాలు, నాడు-నేడుతో అభివృద్ధి చెందిన పాఠశాలలు, మెడికల్ కళాశాలలు, ఇతర అభివృద్ధి పనుల వద్ద సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించింది. ఈ టాస్క్ ఉద్దేశం, వైఎస్ జగన్ మార్క్ పేరుతో నాటి ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు చూపించడం.
ట్విట్టర్ స్పేసెస్ చర్చలు
వైసీపీ సోషల్ మీడియా నాయకత్వం, జిల్లా, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ట్విట్టర్ స్పేసెస్ సమావేశాలు నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడునెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లోపాలపై సోషల్ మీడియా వేదికగా నిలదీయాలని పిలుపునిస్తున్నారు.
YSJaganMark ట్రెండింగ్లోకి..
వేలాది నెటిజన్లు సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో తీసిన ఫొటోలను #YSJaganMark హ్యాష్ట్యాగ్తో షేర్ చేయడంతో, ఇది ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది. కొందరు నెటిజన్లు పవన్ కల్యాణ్ పర్యటించిన ప్రాజెక్టుల ఫొటోలను షేర్ చేస్తూ అవన్నీ గతంలో జగన్ చేపట్టినవేనని పేర్కొన్నారు.








