ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ ఉధృతంగా సాగినా.. తరువాత కీలకంగా ఉన్న వారిని మాత్రమే లిస్ట్ అవుట్ చేసి అరెస్టులు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఒకరైన ఇంటూరి రవికిరణ్పై ఇప్పటికే పదికి పైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా జైల్లో ఉంటున్న ఇంటూరి రవి ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు.
కోర్టు షరతు మేరకు సంతకం పెట్టేందుకు ప్రకాశం జిల్లా మార్టూరు స్టేషన్కుకు వెళ్లిన ఇంటూరిని కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా పర్చూరు పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఎలాంటి వివరాలు చెప్పకుండా తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకొని గుర్తు తెలియని నిర్మానుష్య ప్రదేశంలో ఇంటూరి రవిని వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. కనీసం ఏ కేసుపై తీసుకొని వెళ్లారో కూడా సీఐ శేషగిరి రావు చెప్పలేదని ఇంటూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటూరి రవిని ఇబ్బంది పెట్టిన అంశంలో ఇదే సీఐ శేషగిరిరావుకు న్యాయస్థానం షాకాజ్ నోటీసులు ఇచ్చింది. కక్ష సాధింపులో భాగంగా మరో అక్రమ కేసు బనాయించడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉన్న వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తోందని, తప్పుడు సెక్షన్లు బనాయిస్తూ జైళ్లకు పంపుతుందని వైసీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ జాతీయ మనవహక్కుల కమిషన్ వద్దకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా, ఇంటూరిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను గుర్తుతెలియని ప్రదేశంలో వదిలివెళ్లిపోవడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది.