కిడ్నాప్ వార్త‌ల‌పై ఎమ్మెల్సీ వీడియో బైట్ విడుద‌ల‌

కిడ్నాప్ వార్త‌ల‌పై ఎమ్మెల్సీ వీడియో బైట్ విడుద‌ల‌

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. కూల్చివేత‌లు, దాడులు, కొనుగోళ్లు, బెదిరింపులు, కిడ్నాప్‌లతో టెంపుల్ సిటీ అరాచ‌కంగా మారుతోంది. వైసీపీ భీపార‌మ్‌పై గెలిచిన కార్పొరేట‌ర్లను అధికార కూట‌మి త‌న‌వైపున‌కు లాక్కుంటోందన్న ఆరోప‌ణ‌లు తీవ్ర‌మ‌య్యాయి. నిన్న బ‌స్సులో ఓటింగ్‌కు వెళ్తున్న వైసీపీ కార్పొరేట‌ర్ల బ‌స్సుపై రాళ్ల దాడి జ‌రిగి న‌లుగురు కార్పొరేట‌ర్లు కిడ్నాప్‌న‌కు గుర‌య్యారు. అయితే, తాము క్షేమంగానే ఉన్నామని, గొడవలు చూసి భయపడి వచ్చేశామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.

కాగా, నిన్న అర్ధ‌రాత్రి వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌హ్మ‌ణ్యం కిడ్నాప్‌న‌కు గుర‌య్యార‌ని, కొంత‌మంది ఆయ‌న ఇంట్లోకి చొర‌బ‌డి ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశార‌ని, ఎక్స్ అఫిషియోగా ఆయ‌న ఓటు కీల‌కం కానుండ‌డంతో కిడ్నాప్ చేసిన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ వార్త‌లు వ‌చ్చిన రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌హ్మ‌ణ్యం ఒక వీడియో బైట్ విడుద‌ల చేశారు. తాను కిడ్నాప్‌న‌కు గురికాలేద‌ని, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాన‌ని, వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే వస్తాను అని చెప్పారు. త‌న ఆరోగ్యం గురించి గానీ, కిడ్నాప్‌ వార్తలపై గానీ ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా తిరుపతి ఎస్వీయూ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. నిన్నటి ఘటనల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కోరం లేక నిన్న వాయిదా పడిన డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ను స‌భ్యులు ఎన్నుకోనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment