ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జరిగిందని, దీంట్లో వైసీపీ బడా నేతలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్ కూడా ఉన్నట్లు పలు ప్రధాన మీడియా ఛానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో భూస్కామ్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఈ భూస్కాం అంటూ హడావిడిని సినీ నటి రీతూ చౌదరి భర్త శ్రీకాంత్ కొట్టిపారేశారు. ప్రతిపక్ష వైసీపీ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణిస్తోంది.
2019 నుంచి 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ధర్మసింగ్ను అప్పటి సీఎం వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్, అతని భార్య రీతూ చౌదరి(సినీనటి) రూ. 700 కోట్ల విలువైన భూమిని రాయించుకున్నారని ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని టీడీపీ ఆరోపణలు చేస్తోందని వైసీపీ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, ఏడాదిగా సింగ్ ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని, ఇప్పుడు ఆ అధికారిని అడ్డుపెట్టుకొని జగన్, ఆయన బంధువులు, సిబ్బందిని ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
నేను ఎవరికీ బినామీని కాదు.. శ్రీకాంత్
తనపై వచ్చిన ఆరోపణలపై నటి రీతూచౌదరి భర్త శ్రీకాంత్ తిప్పికొట్టారు. వైఎస్ జగన్కు, ఆయన వ్యక్తిగత కార్యదర్శికి, ఎవరికీ తాను బినామీని కాదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక మీడియా ఛానల్తో మాట్లాడారు. వారితో తనకు ఎటువంటి సంబంధం లేదని, అవసరమైతే కాణిపాకం వినాయక స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని ప్రకటించారు. తాను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారినని, తాను లీగల్ ఆస్తులు మాత్రమే కొనుగోలు చేశానని, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ సింగ్ తనకు రూ.40 లక్షలు బాకీ ఉన్నాడని, తన పేరిట రూ.700 కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు.
టీడీపీ అనుకూల మీడియాగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా ఛానెళ్లు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ఆ దుష్ప్రచారంలో భాగమే శ్రీకాంత్, సింగ్ వ్యవహారమని వైసీపీ వాదిస్తోంది. వాస్తవానికి ఏడాది కిందటే వైసీపీ హయాంలోనే వారిద్దరిపై ఏసీబీ దృష్టి సారించిందని, ఆ వ్యవహారాన్ని ఇప్పుడు జగన్పై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ మండిపడుతోంది.